క్రాబ్ క్రిస్టియన్స్ (Crab Christians)
- Elisha Bonnke
- Jan 12
- 2 min read
విలియం కేరీ గారు (William Carey 1761–1834)
భారతదేశానికి మిషనరీగా రావాలని అనుకున్నప్పుడు
క్రైస్తవుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అందులో ఒక ప్రముఖుడు అతనితో ఇలా అన్నారటా
“దేవుడు అన్యజనులను రక్షించాలనుకుంటే దేవుడు ఎలా అయినా రక్షించగలడు నీవు వెళితేనే అవుతాదనుకుంటున్నావా అని.
దేవుని కొరకు అతడు పైకి వెళ్ళాలనుకుంటే మనుషులు క్రిందికి లాగుతున్నారు. దీనినే Crab mentality (పీతల మనస్తత్వం) అంటారు.
సుమారు 1950 తర్వాత “క్రాబ్ క్రిస్టియన్స్” (Crab Christians) అన్న పేరు క్రైస్తవ సమాజంలో ప్రాచుర్యంలోనికి వచ్చిన ఉపమానాత్మక (metaphorical) పదం.
ప్రధానంగా ప్రసంగీకులు, క్రైస్తవ రచయితలు, ఆధ్యాత్మిక బోధకులు ఈ పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఇది ఒక సామాజిక మరియు ఆధ్యాత్మిక విమర్శా పదముగా ఏర్పడింది.
పీతలును ఒక బకెట్లో వేస్తే అందులో బయటకు రావాలనుకున్న పీతను మిగతా పీతలు క్రిందికి లాగుతాయి. అవి క్రిందకి లాగడానికి వాటికి వేరే ఉద్దేశం ఉండి ఉండవచ్చు, కానీ అది దృశ్య రీతిగా ఒకడు పైకి రావాలనుకుంటే అతని క్రిందికి లాగేవారికి విమర్శన ఉపమానముగా తీసుకున్నారు.
ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రయత్నించే విశ్వాసిని అదే సంఘంలో ఉన్న కొందరు అసూయ, విమర్శ, నిరుత్సాహం ద్వారా వెనక్కి లాగుతారు. అటువంటి ప్రవర్తన చూపించే వారిని “Crab Christians” అని పిలవడం మొదలైంది.
పరిశుద్ధ గ్రంథంలో ఆధ్యాత్మికముగా ఎదుగుతున్న దావీదును అసుయ, స్వార్థం, పగ, అభద్రతా భావం వంటి స్వభావాలతో సౌలు దావీదును రకరకాలు పన్నాగములతో అంతము చేయాలనుకున్నాడు.
మనుష్య కుమారునిగా దిగివచ్చి గొప్ప ప్రభావముతో ముందుకు వెళుతున్న మన ప్రియ ప్రభువును శాస్త్రులు, పరిసయ్యులు, రాజులు, సొంత కుటుంబ సభ్యులు క్రిందికి లాగాలనుకున్నారు.
ముందుకు వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న.. అటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సౌలులు వంటి స్వభావాలు మనలో ఉన్నాయా ? ఉంటే మనకే నష్టం. బకెట్లో పీత ఓడిపోవోచ్చేమో గాని జీవముగల దేవుని సంఘములో/చిత్తములో బలముగా ఎదుగుతున్న విశ్వాసి ఓడిపోడు. ఓడిపోతున్నట్టుగా కనబడతాడు గాని ఓడిపోడు ఇది సత్యం.
సౌలు తరుముతుంటే దావీదు పారిపోతున్నాడు, దావీదు ఓడిపోతున్నాడు అని అందరూ అనుకున్నారు. దేవుని చిత్తమును ఘనపరుస్తున్న దావీదు ఎలా ఓడిపోతాడు, ఓడిపోడు.. ఓడిపోలేదు.
మన ప్రియ ప్రభువును సురూపము లేని వానిగా చేసేసాము అని కొందరు, సొగసు లేని వానిగా అయిపోయాడు అని మరికొందరు అనుకున్నారు.
అయితే, దైవచిత్తానుసారముగా తగ్గిన మన ప్రభువు దేవుని మహిమ యొక్క తేజస్సుగా మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. (హెబ్రీ 1:3)
దేవుడు విలియం కేరీ గారిని పైకి తీసుకెళ్తుంటే మనుషులు కిందికి లాగలనుకున్నారు, అయితే వాటినన్నిటిని విలియం కేరీ గారు అధిగమించి భారతదేశానికి వచ్చారు. భారతదేశాన్ని దైవ వాతావరణంలో ప్రభావితం చేసారు, బైబిల్ తర్జుమా 35 భాషలలో అనువదించారు.
విద్య, సంస్కరణలు, మిషన్ ఉద్యమానికి పునాదులు వేసారు. “ఆధునిక మిషన్ల తండ్రిగా” పిలువబడ్డారు.
*దేవునికి మహిమ కలుగును గాక!*
ఎదుగుతున్న విశ్వాసులను క్రిందికి లాగాలనుకున్నవారు క్రాబ్ క్రిస్టియన్స్.
ఇతరుల ఎదుగుదలను ఓర్వలేని వారు క్రాబ్ క్రిస్టియన్స్.
అయితే ఒక సత్యమును గమనిద్దాం, అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికే శ్రమ (మత్తయి 18:7) గాని ఎదుగుతున్న విశ్వాసి ఓడిపోడు.
మార్కు 14:21
నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.
రెండు కోణాలలో ఉన్న ఈ అంశ పరిశీలనతో మన ఆధ్యాత్మిక జీవితమును ప్రభావితం చేసుకుందాం.
God bless you all
-Elisha Bonnke


Comments